Tuesday, July 28, 2015

పేపర్‌ బాయ్ టు రాష్ట్రపతి భవన్‌

By 6:12 AM

పేపర్‌ బాయ్ టు రాష్ట్రపతి భవన్‌

Posted On 17 hours 50 mins ago
పేపర్‌ బాయ్ టు రాష్ట్రపతి భవన్‌
             న్యూఢిల్లీ : తమిళనాడులోని రామేశ్వరంలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం పేపర్‌ బాయ్  నుంచి రాష్ట్రపతిగా అంచలంచలుగా ఎదిగారు. ఉన్నత చదువులు అభ్యసించి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా మన్ననలు పొందారు. మాతృదేశానికి వెలకట్టలేని సేవలందించి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్నారు. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రూ తర్వాత మళ్లీ పిల్లలకు అంతగా చేరువైన నేత అబ్దుల్‌ కలాం మాత్రమే. ఆయన లేకున్నా..కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండన్న స్ఫూర్తిదీపికలు ప్రజలమదిలో స్థిరంగా ఉంటాయి. నిప్పులు కక్కుతూ నింగికి దూసుకెళ్లే క్షిపణులనే కాదు హుద్రోగులకు అవసరమైన స్టంట్లు, వికలాంగులకు తేలికైన పరికరాలు రూపొందించే మానవతకు నిండైన రూపం కలాం. ఇస్రో, డిఆర్‌డిఒ, తదితర కేంద్రాల్లో ఆయన పలు స్థాయిల్లో పనిచేశారు.
క్షిపణి పితామహుడు
అగ్ని వంటి మధ్యతరహా, పృధ్వి వంటి బాలిస్టిక్‌ క్షిపణులను భారతదేశ అమ్ములపొదిలో సాయుధ సంపత్తిని నింపింది కలామే. ఈ క్షిపణుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించి ఆయన భారత క్షిపణి పితామహుడయ్యారు.
పొఖ్రాన్‌ అణు పరీక్షలు
బిజెపి నేతృత్వంలో ఎన్‌డిఎ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే 1998లో పొఖ్రాన్‌ వద్ద రెండోసారి అణుపరీక్షలు నిర్వహించారు. ఈ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంలో కలాం కీలకపాత్ర పోషించారు.
జీవితవిశేషాలు
జననం: 1931 అక్టోబరు 15, రామేశ్వరం ( తమిళనాడు)
తల్లిదండ్రులు: అపియమ్మ, జైనులబుద్దీన్‌
విద్య: పాఠశాల విద్యంతా రామనంతపురం స్కార్జ్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌,
తిరుచురాపల్లి సెయింట్‌ జోసెఫ్‌ కాలేజిలో కళాశాల విద్య, డిగ్రీ మద్రాస్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ కాలేజిలో భౌతికశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌.
శ్వాస, ధ్యాస ఇస్రో
- మద్రాసు ఐటిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత 1960లో డిఆర్‌డివోలో శాస్త్రవేత్తగా చేరారు. తర్వాత 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు బదిలీ అయ్యారు. ఎస్‌ఎల్‌వీ-3 ప్రాజెక్టు డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరణ. ఇస్రోలో చేరడమే గొప్ప విజయంగా కలాం చెబుతుండేవారు. ఇస్రోనే శ్వాస, ధ్యాసగా ఎన్నో ప్రాజెక్టులకు నేతృత్వం వహించారు. నిప్పులు నింగికి దూసుకెళ్లే పోలార్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్స్‌ (పిఎస్‌ఎల్‌వీ) రూపకల్పనలో కలాం కృషి ఎనలేనిది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన రోహిణి ఉపగ్రాన్ని ఎస్‌ఎల్‌వీ ద్వారా విజయవంతంగా ప్రయోగించి కలాం ప్రశంసలు పొందారు.
- శాస్త్రవేత్తగా కెరీర్‌ ప్రారంభించిన డిఆర్‌డివోలోనే కలాం 1992-99 మధ్య కాలంలో కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే 1998లో పొఖ్రాన్‌-2 అణుపరీక్షలను కలాం నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించి అణ్వాయుధ సాంకేతిక రంగంలో ప్రపంచదేశాలకు భారత తన సత్తా చాటింది.
- ఇస్రో, డిఆర్‌డిఒ వంటి భారత అత్యున్నత పరిశోధన సంస్థల్లో పనిచేసిన కలాంను దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠం వెతుక్కుంటూ వచ్చింది. 2002 జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన కలాం రాష్ట్రపతిభవన్‌ను విఐపిలకే పరిమితం కాకుండా ప్రజలకు చేరువ చేయడంలో ఎంతో కృషి చేశారు. జూలై 25, 2007 వరకు రాష్ట్రపతి పీఠంపై కొనసాగిన ఆయన పిల్లలకు ప్రత్యేక సందర్శన సమయాలు కల్పించి అభినవ ఛాఛా అనిపించుకున్నారు.
ఆయన మాటే నిత్యస్ఫూర్తి
- తన ఆత్మకథను నిత్యస్ఫూర్తి నింపే రచనలుగా మలిచి కలాం ఎంతో మంది యువకులను విజేతలుగా మలిచారు. వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌, ఇగ్నైటెడ్‌ మైండ్స్‌, ఇండియా మై డ్రీమ్‌, ఇన్విజినేషన్‌ ఏన్‌ ఎంపవర్డ్‌ నేషన్‌, ఇండియా 2020 వంటి రచనలను అందించి స్ఫూర్తినింపారు.
పురస్కారాలు
- 1997లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో పాటు కలాంను ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ తర్వాత ఈ పురస్కారం పొందిన మూడో రాష్ట్రపతి కలాం.
1981లో పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ (1990), గౌరవ ఫెలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డైరక్టర్స్‌ (1994), జాతీయ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం (1997),
రామానుజన్‌ అవార్డు (2000), కింగ్‌ చార్లెస్‌ -2 పతకం - రాయల్‌ సోసైటి, యుకె (2007), ఇంటర్నేషనల్‌ వాన్‌ కార్మాన్‌ వింగ్స్‌ అవార్డు (2009), వీటిలో పాటు ఓక్లాండ్‌ యూనివర్సిటి, ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పాటు దేశంలోనే పలు యూనివర్సీటీల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు.
మరిన్ని సంగతులు
- భారత రాష్ట్రపతిగా పనిచేసిన తొలి శాస్త్రవేత్త, అవివాహితుడు కలామే.
- ప్రజలకు అత్యంత ఇష్టమైన రాష్ట్రపతిగా పేరు సంపాదించారు కలాం.
- కలాం రాష్ట్రపతిగా ఉండగా 21 క్షమాబిక్ష విన్నపాలు వచ్చాయి. అందులో ముఖ్యమైనది అప్జల్‌ గురూది. అయితే వీటిలో ఒక పిటిషన్‌ మాత్రమే ఆయన చూశారు.
- 2003, 2005 ఎంటీవి యూత్‌ ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.
- రాష్ట్రపతి పదవి తర్వాత...
దేశాధ్యక్షునిగా పదవీకాలం ముగిసిన తర్వాత కలాం ఆచార్యునిగా పనిచేశారు. దేశంలో ప్రఖ్యాత షిల్లాంగ్‌, ఆహ్మదాబాద్‌, ఇండోర్‌ ఐఐఎంలలో, బెంగళూరు ఐఐఎస్‌, స్పేస్‌ ఇన్‌స్టిట్యూట్‌, అన్నా యూనివర్సిటి, జేఎస్‌ఎస్‌లో విజిటింగ్‌ ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. ఐఐటి హైద్రాబాద్‌, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో సాంకేతికతకు సంబందించిన అంశాలను బోధించారు.
- కలాం జీవితంపై 'ఐ యామ్‌ కలాం' అనే హిందీ సిినిమా వచ్చింది.
కలాం మృతిపట్ల సీఎం దిగ్భ్రాంతి
భారత రత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త విని చలించిపోయారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యావత్‌ దేశానికి మార్గదర్శనం చేశారని అన్నారు. రక్షణ సంబంధ పలు సంస్థలకు ఆయన రూపశిల్పి అని పేర్కొన్నారు. అంతరిక్ష పరిజ్ఞానానికి పితామహుడని పేర్కొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
గొప్ప శాస్త్రవేత్త : పి.మధు
అబ్దుల్‌ కలాం గొప్ప శాస్త్రవేత్తని, ఆయన మృతి శాస్త్ర సాంకేతిక రంగానికి, దేశానికి తీరనిలోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఒక దార్శనికుడిని కోల్పోయిందని తెలిపారు. ఆయన ముందుచూపు ఆలోచనా ధోరణి యువతకు ఆదర్శమని తెలిపారు. సాంకేతికతను ప్రజలకు చేరువచేయాలనే కలాం ఆలోచన అజరామరమని పేర్కొన్నారు.

0 comments: